కరుణశ్రీ కవిత్వం: సందేశం
Authors/Creators
- 1. సహాయాచార్యులు, తెలుగుశాఖ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
Description
జంధ్యాల పాపయ్య శాస్త్రి 'కరుణశ్రీ' కలంపేరుతో సుప్రసిద్ధులు. తెలుగుబాల శతకం, పుష్పవిలాపం వంటి రచనలు ఆయనను పాఠశాల విద్యార్థులకు సైతం చేరువ చేశాయి. పద్య నాటకం, కథ, జీవిత చరిత్ర, నవలిక, అనువాద కావ్యం, వ్యాఖ్యానం, గేయం, శతకం ఇలా దాదాపు 80 గ్రంథాలు రచించి తెలుగు సాహిత్యానికి విశేష సేవలు అందించారు. ఈ పరిశోధన కరుణశ్రీ కవిత్వంలో నిబిడీకృత సందేశాలను విశదపరచడం లక్ష్యంగా కొనసాగింది. ఆధునిక కవిత్వం కేవలం ఆనందం మాత్రమే కాక, సామాజిక ప్రయోజనాలు కూడా అందించాలి అన్న సిద్ధాంతానికి కరుణశ్రీ రచనలు చక్కటి ఉదాహరణలు. ప్రాచీన, ఆధునిక విమర్శకులు కవిత్వ ప్రయోజనాలు చర్చించిన తీరు పరిశీలిస్తూ, కరుణశ్రీ సందేశాత్మక ధర్మం నిరూపణ ఈ వ్యాసం ఆవశ్యకత. కరుణశ్రీ సమగ్ర రచనలపై డి.ఎస్వీ. సుబ్రహ్మణ్యం పీహెచ్డీ, డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు 'కరుణశ్రీ కవితాసౌరభం' వంటి పూర్వ పరిశోధనలు ఉన్నాయి. అయినా, ఆయన కవిత్వం లోతైన సందేశాలు విశ్లేషించే ప్రయత్నం ప్రస్తుత వ్యాసం చేపట్టింది. విషయసేకరణకు కరుణశ్రీ మూల రచనలు, వివిధ విమర్శనా గ్రంథాలు, మాసపత్రికల వ్యాసాలు ఆధారమయ్యాయి. పరిశోధనా పద్ధతి వివరణాత్మకం, విశ్లేషణాత్మకం. ఈ సాహిత్య విశ్లేషణ ఆయన కవితాఖండికలు, కావ్యాలను అధ్యయనం చేసింది. పరిశోధన ఫలితాలు ఆయన కవిత్వంలోని స్పష్టమైన సందేశాలను వెలికితీశాయి. కరుణశ్రీ తన తొలి కవిత 'పాకీపిల్ల'లో మానవత్వాన్ని, విశ్వప్రేమను చాటారు. అందరూ చీదరించుకునే పాకీపిల్లలో జగన్మాతను దర్శించి, ఆమె సేవలు సమాజానికి ఎంత ముఖ్యమో తెలియజేశారు. 'విజయశ్రీ' కావ్యం ద్వారా స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించారు. మహాభారత నేపథ్యం ఉపయోగించుకొని ఆంగ్లేయుల పాలనలో బానిస జీవితం విడిచి, స్వేచ్ఛను ఆస్వాదించమని భారతీయులకు పిలుపునిచ్చారు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో విద్రోహులను నిర్మూలించి, స్వతంత్ర భారత పతాకం ఎగురవేయాలి అని ప్రబోధించారు. 'కరుణశ్రీ' అనే స్వంత కావ్యంలో బుద్ధ భగవానుని జీవితగాథను ఇతివృత్తం చేసి, అహింసావాదం, దయాగుణం ప్రాముఖ్యతను నిరూపించారు. దేవదత్తుడు బాణంతో కొట్టిన హంసను సిద్ధార్థుడు రక్షించిన సంఘటన ద్వారా కరుణామయుడైన బుద్ధుని గొప్పతనం అద్భుతంగా చిత్రించారు. 'ఉదయశ్రీ' సంపుటిలో 'తెలుగుతల్లి' ఖండిక ద్వారా సుప్తమైన తెలుగుజాతిని జాగృతం చేసే వైతాళిక గీతాన్ని అందించారు. కాకతీయ, విజయనగర, పల్నాటి వీరుల చరిత్ర స్మరిస్తూ, ఆంధ్ర పౌరుషం తిరిగి నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 'పుష్పవిలాపం' ఖండిక పూల మౌనభాషను ఆవిష్కరిస్తూ, మానవుల స్వార్థాన్ని ప్రశ్నించి, జీవకారుణ్యం కలిగి ఉండాలి అని సందేశం ఇచ్చింది. 'అమర్ ఖయామ్' అనువాద కావ్యం ద్వారా జీవితం ఒక రంగస్థలంపై నటించే పాత్ర వంటిదని, భగవంతుడే సూత్రధారి అని తాత్విక సందేశం అందించారు. చైనా దురాక్రమణ లాంటి సమకాలీన దేశీయ సమస్యలపై సైతం ఆయన తన కవిత్వం ద్వారా విమర్శనాత్మక సందేశాలు అందించారు. ఈ విధంగా కరుణశ్రీ కవిత్వం సద్యఃపరనివృత్తితో పాటు లోతైన సామాజిక, తాత్విక సందేశాలను అందించినట్లు ఈ పరిశోధన తెలియజేస్తుంది. ఆయన సాహిత్య సేవ విస్తృతమైనది; భవిష్యత్ పరిశోధనలకు ఇంకా అనేక అంశాలు ఉన్నాయి.
Files
september25_06.pdf
Files
(723.1 kB)
| Name | Size | Download all |
|---|---|---|
|
md5:e27aee5067f92bf283b527c990fcca2a
|
723.1 kB | Preview Download |